రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బీసీలను అవమానించడమే: తలసాని
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీసీ సంక్షేమంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రతి ఏటా బీసీల కోసం రూ. 20,000 కోట్లు ఖర్చు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని తలసాని మండిపడ్డారు. బీసీ సబ్ ప్లాన్ కు మొదటి ఏడాది రూ. 800 కోట్లు చేస్తామన్నారు... రెండో ఏడాది రూ. 11,000 కోట్లు కేటాయించి, క్షేత్రస్థాయిలో కేవలం రూ. 3 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బీసీలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను తీసుకొచ్చి అబద్ధపు హామీలు ఇప్పించి బీసీల ఓట్లు దండుకున్నారని విమర్శించారు. బీసీ విద్యార్థుల కోసం విదేశీ విద్య, గురుకులాలు, కులవృత్తుల ప్రోత్సాహానికి కేసీఆర్ గారు చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లింగయ్య యాదవ్ వంటి నేతలకు రాజ్యసభ అవకాశం ఇచ్చి బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించామన్నారు.