సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను నిన్న సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

వాతావరణ మార్పుల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పాటు ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ (79) వెంట ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ప్రత్యేక వైద్య బృందం సోనియా ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆమెకు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని, ఆందోళన చెందాల్సినంత తీవ్రమైన సమస్య ఏమీ లేదని సమాచారం.
 
సోనియా గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో కూడా ఆమె ఇదే సమస్యతో గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతానికి సోనియాను వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది.
 


More Telugu News