ఇది పరిష్కారంలేని సమస్య: కాంగ్రెస్ పార్టీని వీడటంపై జీవన్ రెడ్డి వ్యాఖ్య

తాను పార్టీ వీడటాన్ని ఉద్దేశించి, జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఇది పరిష్కారం లేని (పార్టీని వీడటం) సమస్యగా అభివర్ణించారు. ఈ సమస్యకు పరిష్కారం తన వద్దలేదని, అలాగే కాంగ్రెస్ వద్ద కూడా లేదని వ్యాఖ్యానించారు.

రేపు ఉదయం అందరూ స్థానిక బండారి గార్డెన్‌కు రావాలని కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తు పయనం ఎలా ఉంటుందో తెలియదని అన్నారు. అధిష్ఠానం తనను బుజ్జగించలేదని, తాను పార్టీ వీడి వెళుతున్నానని తెలిసి, ఇలా వచ్చి అలా వెళుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్వపక్షంతో యుద్ధం చేయలేనని అన్నారు. రేపు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. సమస్య పరిష్కరించలేని స్థాయికి చేరుకుందని, అందుకు కారకులు ఎవరో కూడా గుర్తించాలని అన్నారు. తాను పార్టీ మారడం కాస్త ఇబ్బందికర అంశమే అన్నారు. రేపు రాజకీయంగా ఏదో నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తన నిర్ణయం దైవనిర్ణయంగా ఆయన పేర్కొన్నారు.

రాజకీయాల్లో తనది పూలబాట కాదని, ముళ్లబాట అన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి, మల్లు భట్టివిక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన అధిష్ఠానం, తనను ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెబుతున్నదేమిటి, చేస్తున్నదేమిటని నిలదీశారు.

నాలుగు దశాబ్దాలుగా తన వెన్నంటి ఉండి, రాష్ట్రస్థాయిలో తనకు గుర్తింపు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు అన్నారు. ఇలాంటి పార్టీని వీడటం ఇబ్బందికరమే అన్నారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వరుసగా ఆయనను కలుస్తున్నారు. ఈరోజు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జగిత్యాలలో జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. పార్టీని వీడవద్దని కోరారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.


More Telugu News