కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉంది: షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు అన్యాయం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ చూసి అంతా తుస్సుమనిపించిందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వాస్తవ ఖాళీలు ఎన్ని, వాటిని ఎప్పటిలోగా భర్తీ చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతోపాటు, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.


More Telugu News