జొమాటో బాటలో స్విగ్గీ.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో బాటలోనే స్విగ్గీ కూడా పయనించింది. తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఆర్డర్‌పై వసూలు చేసే ఈ రుసుమును రూ. 14.99 నుంచి రూ. 17.58కి పెంచింది. అంటే జీఎస్టీతో కలిపి దాదాపు 17 శాతం మేర ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఈ ఛార్జీలు స్విగ్గీ యాప్‌లో వినియోగదారులకు ఇప్పటికే కనిపిస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితమే జొమాటో కూడా తన ప్లాట్‌ఫామ్ ఫీజును 19 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో ఆర్డర్‌పై రూ. 2 అదనపు భారం పడింది. తాజా పెంపుతో స్విగ్గీ, జొమాటో రెండు యాప్‌లలోనూ ప్లాట్‌ఫామ్ ఫీజు జీఎస్టీతో కలిపి దాదాపు రూ. 17.58కి చేరింది. "ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించడానికి, మెరుగైన సేవలు అందించడానికి" ఈ పెంపు దోహదపడుతుందని స్విగ్గీ తమ వినియోగదారులకు తెలియజేసింది.

నిర్వహణ ఖర్చులు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎల్‌పీజీ, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాములపై ఖర్చుల భారం ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ డెలివరీ సంస్థలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి ప్లాట్‌ఫామ్ ఫీజులను సవరిస్తున్నాయి. జొమాటో 2023 ఆగస్టులో రూ. 2తో ఈ ఫీజును ప్రారంభించి, దశలవారీగా పెంచుకుంటూ వచ్చింది.

కాగా, మంగళవారం ట్రేడింగ్‌లో స్విగ్గీ షేర్లు 0.33 శాతం లాభంతో రూ. 273.40 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గత నెలలో ఈ స్టాక్ 10 శాతానికి పైగా నష్టపోయింది. మరోవైపు ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు తర్వాత జొమాటో షేర్లు 2 శాతం మేర లాభపడటం గమనార్హం.


More Telugu News