క్షేత్రస్థాయిలో క్షిపణులు.. సోషల్ మీడియాలో మీమ్స్.. ఇరాన్ సరికొత్త యుద్ధ తంత్రం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సరికొత్త యుద్ధ తంత్రానికి పదునుపెట్టింది. కేవలం క్షిపణులు, డ్రోన్‌లతోనే కాకుండా సోషల్ మీడియాను ఒక శక్తిమంతమైన ఆయుధంగా మార్చుకుని అమెరికా, ఇజ్రాయెల్‌పై ‘మానసిక యుద్ధం’ చేస్తోంది. క్షేత్రస్థాయి పోరాటంతో పాటు డిజిటల్ ప్రపంచంలోనూ ప్రత్యర్థులను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇరాన్ అనుకూల మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలు మీమ్స్, ఏఐ-జనరేటెడ్ వీడియోలతో విరుచుకుపడుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను టార్గెట్ చేస్తూ వారిని కార్టూన్ పాత్రలుగా, లెగో బొమ్మలుగా హాస్యాస్పద వీడియోలను వైరల్ చేస్తున్నాయి. పాత వివాదాలను తవ్వుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ‘సమాచార యుద్ధం’ ద్వారా తమ సైనిక బలహీనతను కప్పిపుచ్చుకోవాలని ఇరాన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, కీలకమైన హర్మూజ్ జలసంధిపై తనకున్న పట్టును ఇరాన్ ప్రచారానికి వాడుకుంటోంది. తనను తాను "జలసంధికి ప్రభువు" అని అభివర్ణించుకుంటూ ప్రపంచ ఇంధన సరఫరాను శాసించగలనని హెచ్చరికలు పంపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నప్పటికీ, తమ భౌగోళిక అనుకూలతతో తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, క్షిపణులతో యుద్ధాన్ని అత్యంత ఖరీదైనదిగా మార్చగలమని చాటుతోంది. ఇటీవల అమెరికా దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా, ఇరాన్ దౌత్యపరమైన వ్యంగ్యంతో స్పందించింది.

‘‘ఈ రాత్రి ‘మిస్టర్ ఖుర్రంషహర్-4’ నేతృత్వంలోని దౌత్య బృందం చర్చలు జరుపుతుంది’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఖుర్రంషహర్-4’ అనేది ఇరాన్ శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణి పేరు. చర్చలు ఉండవని, క్షిపణి దాడే సమాధానమని పరోక్షంగా హెచ్చరించింది. ఈ వ్యూహాలతో ఇరాన్.. క్షిపణుల కన్నా మీమ్స్‌తోనే ప్రత్యర్థుల్లో ఎక్కువ భయాన్ని సృష్టిస్తోందని నిపుణులు అంటున్నారు.


More Telugu News