రాజమహేంద్రవరం-హైదరాబాద్ మధ్య మూడు కొత్త‌ విమాన సర్వీసులు

ఏపీలో విమానయాన సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి డిమాండ్ ఉన్న రూట్లలో కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు మరో మూడు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఫ్లై 91 ఎయిర్‌లైన్స్ ఈ సేవలను అందించేందుకు ముందుకొచ్చింది.

ఈ నెల 29వ తేదీ నుంచి ఈ మూడు కొత్త సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9:15 గంటలకు, మధ్యాహ్నం 1:05 గంటలకు, రాత్రి 9:05 గంటలకు ఈ విమానాలు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతాయి. ఈ నిర్ణయంతో రాజమండ్రి-హైదరాబాద్ మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది.

ప్రస్తుతం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు 5 సర్వీసులు.. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు ఒక్కో సర్వీసు నడుస్తున్నాయి. తాజా నిర్ణయంతో హైదరాబాద్‌కు నడిచే విమానాల సంఖ్య పెరగనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ, కర్నూలు వంటి విమానాశ్రయాల నుంచి కూడా కనెక్టివిటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రయాణికులకు ఊరటనిస్తోంది.


More Telugu News