గల్ఫ్ దేశాల సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు అండ!

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు మద్దతుగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక అడుగులు వేస్తున్నాయని, ఈ పరిణామం యుద్ధ తీవ్రతను మరింత పెంచే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ (డ‌బ్ల్యూఎస్‌జే) తన కథనంలో వెల్లడించింది. ఈ వార్తలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.

విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ డ‌బ్ల్యూఎస్‌జే తెలిపిన వివరాల ప్రకారం అమెరికా సైన్యం తమ కింగ్ ఫహద్ ఎయిర్ బేస్‌ను వాడుకోవడానికి సౌదీ అరేబియా అంగీకరించింది. గతంలో ఇరాన్‌పై దాడికి తమ స్థావరాలను ఉపయోగించుకోనివ్వమని చెప్పిన సౌదీ, ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం. మరోవైపు టెహ్రాన్‌కు కీలక మద్దతును దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఇరాన్ యాజమాన్యంలోని ఒక ఆసుపత్రిని, క్లబ్‌ను యూఏఈ మూసివేసిందని కూడా ఈ కథనం పేర్కొంది.

అలాగే, ఇరాన్‌పై జరిగిన కొన్ని క్షిపణి దాడులకు బహ్రెయిన్‌ను కూడా వేదికగా చేసుకున్నట్లు చూపే వీడియోలు వెలుగులోకి వచ్చాయని డ‌బ్ల్యూఎస్‌జే తెలిపింది. అయితే, ఈ ప్రాంతంలోని దేశాల నుంచి సహాయం అందుతుందా? లేదా? అనే విషయంపై స్పందించేందుకు అమెరికా సైన్యం నిరాకరించింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగ్గా, అమెరికా స్టాక్-ఇండెక్స్ ఫ్యూచర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్.. పలు పొరుగు దేశాల్లోని లక్ష్యాలపై దాడులు చేయడంతో గల్ఫ్ భాగస్వామ్య దేశాల్లో అసహనం పెరుగుతోందని ఈ నివేదికలు సూచిస్తున్నాయి. గత వారం ఇరాన్‌కు చెందిన గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని ఇంధన ఆస్తులపై ఇరాన్ దాడులు చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇకపై ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకోబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే... ఇరాన్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయని, ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సోమవారం ప్రకటించారు. అయితే, ఈ చర్చల వివరాలపై స్పష్టత లేదు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్‌తో చర్చలు జరిగాయని ఒక నివేదిక రాగా, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన ఖండించారు. మధ్యవర్తుల ద్వారా అమెరికా చర్చలకు ప్రయత్నించినా తాము స్పందించలేదని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. దీంతో ఒకవైపు సైనిక సమీకరణాలు, మరోవైపు చర్చలపై నెలకొన్న గందరగోళం పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది.


More Telugu News