కేటీఆర్‌కు బిగుస్తున్న ఫార్ములా-ఈ ఉచ్చు.. ఛార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా (ఏ1) చేర్చడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్సేన్‌సాగర్ వేదికగా జరిగిన ఫార్ములా-ఈ రేసు నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 55 కోట్లను ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) అనే విదేశీ సంస్థకు మళ్లించారని, ఇందులో నేరపూరిత కుట్ర ఉందని ఆరోపించింది. ఈ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదని, ఆర్బీఐ నిబంధనలను సైతం ఉల్లంఘించారని తెలిపింది. అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఈ నిధులను విడుదల చేశారని ఏసీబీ స్పష్టం చేసింది.

ఈ ఒప్పందానికి ప్రతిఫలంగా (క్విడ్ ప్రో కో) బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ. 45 కోట్లు అందాయని ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు ఆధారంగా ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు ప్రారంభించడంతో కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

మరోవైపు, ఈ పరిణామంపై స్పందించిన కేటీఆర్, ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని కొట్టిపారేశారు.


More Telugu News