పోలీసుల తీరుపై అంబటి ధ్వజం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని హెచ్చరిక

తన నివాసం, కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 31న సుమారు 7 గంటల పాటు తన ఆస్తులపై విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


తన ఇంటిపై దాడి చేసిన వారికి కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని, కానీ అదే సెక్షన్లతో తనను మాత్రం 18 రోజుల పాటు జైలుకు పంపడం అన్యాయమని అంబటి మండిపడ్డారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరారు.


టీడీపీ నేతలు దాడి చేస్తున్నప్పుడు పోలీసులు వారికి పూర్తిగా సహకరించారని, తాను ఫిర్యాదు చేసే వరకు కనీసం సుమోటోగా కూడా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ముఖ్యంగా పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఈ కేసులో దారుణంగా వ్యవహరించారని అన్నారు. ఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ హస్తం ఉందని నేరుగా ఆరోపించారు.


ఈ కేసులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంబటి స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని, హత్యాయత్నం, ఆస్తి నష్టం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, అక్కడ న్యాయం జరగకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేందుకైనా సిద్ధమని హెచ్చరించారు.


More Telugu News