సముద్ర గర్భంలో డేటా కేబుళ్లపై యుద్ధ ప్రభావం.. మెటా కీలక ప్రాజెక్టుకు బ్రేక్!

పశ్చిమాసియాలో రాజుకుంటున్న యుద్ధం కేవలం గగనతలం, భూభాగాలకే పరిమితం కావడం లేదు. ప్రపంచ డిజిటల్ వ్యవస్థకు వెన్నెముకలాంటి సముద్రగర్భ డేటా కేబుళ్లపైనా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తాజా నిదర్శనంగా, మెటా (ఫేస్‌బుక్ మాతృసంస్థ) చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘2 ఆఫ్రికా’ కేబుల్ ప్రాజెక్టు పనులు పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ అల్కాటెల్ సబ్‌మెరైన్ నెట్‌వర్క్స్ ‘ఫోర్స్ మేజర్’ (అనివార్య కారణాలు) నోటీసులు జారీ చేయగా, కేబుల్ వేసే నౌక సౌదీ అరేబియా సమీపంలో చిక్కుకుపోయింది. ఈ పరిణామం కేవలం ప్రస్తుత డిజిటల్ మార్గాలకే కాదు, భవిష్యత్తులో నిర్మించ తలపెట్టిన పటిష్ఠమైన వ్యవస్థలకూ యుద్ధం ఆటంకం కలిగిస్తోందని స్పష్టం చేస్తోంది.

ప్రపంచంలో రెండు ప్రాంతాలు ప్రస్తుతం డిజిటల్ కమ్యూనికేషన్లకు అత్యంత కీలకమైనవిగా ఉన్నాయి. అవే ఎర్ర సముద్రం, హ‌ర్మూజ్ జలసంధి. ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలను కలిపే ఎర్ర సముద్రం ఇప్పటికే అత్యంత ముఖ్యమైన సబ్‌సీ డేటా కారిడార్‌గా ఉంది. గతంలో ఇక్కడ కేబుళ్లు దెబ్బతినడంతో భారత్, పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం తగ్గి, సేవలకు అంతరాయం కలిగింది. ఈ మౌలిక సదుపాయాలు ఎంత సున్నితమైనవో ఆ ఘటన గుర్తుచేసింది. ఇప్పుడు హ‌ర్మూజ్ జలసంధి కూడా ప్రాంతీయంగా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏఏఈ-1, ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జ్ వంటి కీలక కేబుల్ వ్యవస్థలు దీని గుండానే వెళుతున్నాయి. గల్ఫ్ దేశాలలోని డేటా సెంటర్లను అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానించడంలో ఇది కీలకం. అందుకే హ‌ర్మూజ్‌ను ఇప్పుడు కేవలం చమురు మార్గంగానే కాకుండా కమ్యూనికేషన్స్ చౌక్‌పాయింట్‌గానూ చూస్తున్నారు.

సముద్ర గర్భంలోని కేబుళ్లు 95శాతం పైగా అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను, రోజూ సుమారు 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లావాదేవీలను మోసుకెళ‌తాయి. వీటిని లక్ష్యంగా చేసుకోవడం సులభం కాకపోయినా... నౌకల లంగర్లు, ప్రమాదాలు, సైనిక కార్యకలాపాల వల్ల అవి దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే, ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఇంటర్నెట్ మొత్తం ఆగిపోతుందన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఒక మార్గం దెబ్బతింటే నెట్‌వర్క్‌లు ప్రత్యామ్నాయ మార్గాల్లో డేటాను మళ్లిస్తాయి. కానీ, అసలైన ముప్పు ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోవడం కాదు, వేగం తగ్గడం (లేటెన్సీ), ప్రాంతీయంగా సేవలు నిలిచిపోవడం, డేటా ప్రవాహానికి తీవ్ర అంతరాయాలు కలగడం.

కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావడం, ఇప్పటికే ఉన్న మార్గాలు బలహీనంగా ఉండటం, యుద్ధ వాతావరణం నెలకొనడం.. ఈ మూడు అంశాలు కలిసి డిజిటల్ ప్రపంచానికి కొత్త సవాల్ విసురుతున్నాయి. ఎర్ర సముద్రం, హ‌ర్మూజ్ జలసంధి మార్గాల్లో ఏకకాలంలో సమస్యలు తలెత్తితే దాని ప్రభావం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. క్షిపణుల దాడులు వార్తల్లో నిలుస్తున్నా.. సముద్ర గర్భంలో ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై ఒత్తిడి నిశ్శబ్దంగా పెరుగుతోంది.


More Telugu News