సౌదీపై ఇరాన్ క్షిపణి దాడుల్లో తెలంగాణ వ్యక్తి దుర్మరణం

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఓ తెలుగు వ్యక్తిని బలిగొన్నాయి. సౌదీ అరేబియాపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల కారణంగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన రవిగోపాల్ అనే వ్యక్తి మృతి చెందినట్టు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


మార్చి 18వ తేదీ రాత్రి సౌదీ రాజధాని రియాద్‌లోని కీలక లక్ష్యాలపై ఇరాన్ నాలుగు క్షిపణులను ప్రయోగించింది. అయితే సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని గాలిలోనే కూల్చివేశాయి. దురదృష్టవశాత్తూ, కూల్చివేసిన క్షిపణి శకలాలు రియాద్‌లోని ఒక ఆయిల్ రిఫైనరీ సమీపంలో పడ్డాయి. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న రవిగోపాల్‌పై ఈ శకలాలు పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


రవిగోపాల్ మృతి సమాచారంతో ఆయన కుటుంబం ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. "18వ తేదీ రాత్రి 9.30 గంటలకు రవితో 20 నిమిషాల పాటు మాట్లాడాం. ఆ తర్వాత కాల్ కట్ అయ్యింది, అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది" అని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రవికి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఇంటికి ఆయనొక్కడే ఆధారం. ఇంటికి రవి ఒక్కడే ఆధారం. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. రవి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చాలని, అనాథలైన తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక పరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

మరోవైపు, విదేశాంగ శాఖ అధికారి అసీమ్ మహాజన్ మాట్లాడుతూ... మృతుడి కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగిస్తామని తెలిపారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉన్న భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


More Telugu News