కాల్పుల విరమణకు ఒప్పుకోబోం.. ఇరాన్ సంచలన ప్రకటన

అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధంపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టంచేశారు. యుద్ధానికి శాశ్వత ముగింపు లభించాలే తప్ప, మధ్యలో ఆగి మళ్లీ మొదలయ్యే పరిస్థితిని సహించబోమని తేల్చి చెప్పారు.

గతంలో లెబనాన్, గాజా వంటి ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినా, ఇజ్రాయెల్ వాటిని ఉల్లంఘించి మళ్లీ దాడులకు పాల్పడిందని అరాఘ్చీ గుర్తుచేశారు. ‘‘గతేడాది నాటి చేదు అనుభవాలు పునరావృతం కాకూడదు’’ అని ఆయన అన్నారు. శత్రువులు మళ్లీ ఇరాన్‌పై దాడి చేయాలనే ఆలోచన కూడా చేయలేని విధంగా ఈ యుద్ధానికి ముగింపు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ యుద్ధానికి అమెరికానే పూర్తి బాధ్యత వహించాలని అరాఘ్చీ డిమాండ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ ‘అక్రమ యుద్ధం’ వల్ల ఇరు దేశాల ప్రజలు నష్టపోతున్నారని విమర్శించారు. అమెరికా తన దుందుడుకు వైఖరిని ఆపేంత వరకు తమ సాయుధ దళాలు పోరాటం కొనసాగిస్తాయని, షరతులు లేకుండా లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన దాడుల్లో తమ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ వంటి కీలక నేతలు మరణించినప్పటికీ, ఇరాన్ రాజకీయ వ్యవస్థ ఎంతో పటిష్ఠంగా ఉందని అరాఘ్చీ ధీమా వ్యక్తం చేశారు. ఒకరిద్దరు వ్యక్తులు మరణించినంత మాత్రాన వ్యవస్థలు కుప్పకూలవని, వెంటనే ప్రత్యామ్నాయ నాయకత్వం బాధ్యతలు స్వీకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News