కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్, 2026 ఏప్రిల్ 1 నుంచి తమ కార్ల ధరలను పెంచనుంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో ధరలను సవరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తన ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) ప్యాసింజర్ వాహనాల శ్రేణి ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను పాక్షికంగా భర్తీ చేసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

సగటున పెరుగుదల సుమారు 0.5 శాతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే మోడల్, వేరియంట్‌ను బట్టి ఏప్రిల్ 1 నుంచి ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది. టాటా మోటార్స్ ఇప్పటికే కమర్షియల్ వాహన ధరలను పెంచింది. వాహనం రకాన్ని బట్టి 1.5 శాతం వరకు పెంచింది.

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఆడి సంస్థ కూడా ఏప్రిల్ 1 నుంచి తన కార్ల ధరలను 2 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. మెటల్ ధరలు పెరిగాయని, కార్ల ధరలు పెంచడంపై సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.


More Telugu News