ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 21న జరగాల్సిన పదో తరగతి (ఎస్ఎస్‌సీ) ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 2, 2026న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21వ తేదీని (శనివారం) ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. వాస్తవానికి ముందుగా మార్చి 20న సెలవుగా భావించినప్పటికీ, చంద్రుని దర్శనంపై ఏపీ వక్ఫ్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెలవు తేదీని మార్చి 21కి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రోజున పదో తరగతి పరీక్ష షెడ్యూల్ ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ మార్పు చేసింది.

వాయిదా పడిన మూడో లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్షను (పేపర్ కోడ్: 13E & 14E) ఏప్రిల్ 2వ తేదీన (గురువారం) ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే, మిగతా పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్పును విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించి కొత్త తేదీకి అనుగుణంగా సిద్ధం కావాలని అధికారులు సూచించారు.
 


More Telugu News