71 ఎకరాల వక్ఫ్ భూమిపై నారా లోకేశ్ కన్ను పడింది: అంజాద్ బాషా

ముస్లింల పట్ల చంద్రబాబుకు ఉన్నది కపట ప్రేమ అని వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. జగన్ హయాంలో మైనారిటీల సంక్షేమం కోసం రూ. 24,304 కోట్లు ఖర్చు చేశారని కొనియాడారు. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని... చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చారని తెలిపారు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈద్గాలు, ఖబరిస్థాన్ లకు భూములు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 


చినకాకాని వద్ద ఉన్న 71 ఎకరాల వక్ఫ్ భూమిపై మంత్రి నారా లోకేశ్ కన్ను పడిందని, పరిశ్రమల పేరుతో ఆ భూములను లాక్కునేందుకు జీవో ఇచ్చారని ఆరోపించారు. రాజధానిలో వేల ఎకరాలు ఉండగా వక్ఫ్ భూములే ఎందుకు కావాలని ప్రశ్నించారు. 1870 మంది హజ్ యాత్రకు వెళ్తే కేవలం 72 మందికే చంద్రబాబు ఆర్థిక సాయం చేశారని... ఈ ఏడాది వెళ్తున్న 2005 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున సాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం ఇప్పటికీ కాగితాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ముస్లింల విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు.



More Telugu News