పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అరెస్ట్

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె ఆర్డీవో కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ పోలీసులు తాజాగా కీలక అడుగు వేశారు. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాధవరెడ్డిని (ఏ3) అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు మరో నిందితుడు తుకారాం (ఏ4)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన ఈ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదయింది.


విలువైన భూములకు సంబంధించిన కీలక దస్త్రాలు, ముఖ్యంగా కబ్జాలకు గురైనట్లు ఆరోపణలు ఉన్న భూముల ఫైళ్లు ఈ ప్రమాదంలో కాలిపోవడంపై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి సీరియస్‌గా ఉంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఐడీ, లోతైన విచారణ జరిపి సేకరించిన పక్కా ఆధారాలతోనే వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై వేటు పడగా, ఇప్పుడు రాజకీయ నేతల అనుచరుల అరెస్టులతో అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ వేగవంతం కానుంది.



More Telugu News