ఆ సర్‌ప్రైజ్ థియేటర్‌లోనే చూడండి.. 'ధురంధర్ 2' దర్శకుడి ప్రత్యేక విన్నపం

ఆదిత్య ధర్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'ధురంధర్: ది రివెంజ్' ('ధురంధర్ 2') చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సినిమా చూసిన తర్వాత కథలోని కీలక మలుపులు, సస్పెన్స్ అంశాలను (స్పోయిలర్స్) సోషల్ మీడియాలో పంచుకోవద్దని ఆయన అభ్యర్థించారు.

'ధురంధర్' సీక్వెల్‌లో 'బడే సాహెబ్' ఎవరు అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పాత్రను సల్మాన్ ఖాన్ లేదా ఇమ్రాన్ హష్మీ పోషించి ఉండవచ్చని సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సస్పెన్స్‌కు రేపు థియేటర్లలోనే తెరపడుతుందని చిత్రబృందం చెబుతోంది. ఈ ఉత్కంఠను ప్రతి ఒక్కరూ థియేటర్‌లోనే అనుభూతి చెందాలని ఆదిత్య కోరారు.

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టిన ఆదిత్య, తొలి భాగం 'ధురంధర్'ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. "మీరు మా సినిమాను ప్రేమించారు, అందులో జీవించారు. అందుకే 'ధురంధర్: ది రివెంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకున్నాం. ఊహించని భావోద్వేగాలను మీకు పంచాలని గట్టిగా ప్రయత్నించాం" అని ఆయన పేర్కొన్నారు.

"ప్రతి మలుపును, ప్రతి భావోద్వేగాన్ని థియేటర్‌లో స్నేహితులు, కుటుంబంతో కలిసి ఆస్వాదించాలి. దయచేసి స్పోయిలర్స్ పంచుకోవద్దు. ప్రతి అభిమాని ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వచ్చి, తమదైన వ్యక్తిగత అనుభూతితో బయటకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఆదిత్య ధర్ తన పోస్టులో రాసుకొచ్చారు.


More Telugu News