కరీంనగర్‌లో ఎస్సై భార్య ఆత్మహత్య

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లోని హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న దివ్య మంగళవారం ఇంట్లో గన్నేరు పప్పు నూరుకుని నీళ్ళల్లో కలుపుకుని తాగారు.

కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో బుధవారం ఆమె ప్రాణాలు విడిచారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తీవ్రమైన కడుపునొప్పి భరించలేకనే దివ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


More Telugu News