ఆ ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీరియస్.. మూసివేత తప్పదంటూ వార్నింగ్!

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. చాలా కాలంగా వాడకంలో లేని (ఇన్‌ఆపరేటివ్) ఖాతాలను పునరుద్ధరించుకోవాలని సూచించింది. ఇందుకోసం నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 15వ తేదీలోగా కేవైసీ అప్‌డేట్ చేయని ఖాతాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేస్తామని స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటన విడుదల చేసింది. గడువు ముగిసిన తర్వాత అకౌంట్ క్లోజ్ అయితే, ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలు జరపడం సాధ్యం కాదని పేర్కొంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలో కస్టమర్ వరుసగా రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే, ఆ ఖాతాను 'ఇన్‌ఆపరేటివ్ అకౌంట్‌'గా వర్గీకరిస్తారు. ఇలాంటి ఖాతాలపైనే పీఎన్‌బీ తాజా ప్రకటన చేసింది. ఖాతాదారులు తమ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

కేవైసీ ప్రక్రియ అంటే కస్టమర్ తన గుర్తింపు, చిరునామా వివరాలను బ్యాంకు వద్ద అప్‌డేట్ చేసుకోవడమే. ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి అధికారిక పత్రాలను బ్యాంకు శాఖలో సమర్పించి కేవైసీని పూర్తి చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారా కూడా కేవైసీ అప్‌డేట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.

ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం సర్వసాధారణమైపోయింది. ఉద్యోగం మారినప్పుడు కొత్తగా శాలరీ అకౌంట్ తెరవడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి ప్రత్యేక ఖాతా, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం అకౌంట్లు తెరవడం వంటి కారణాలతో ఖాతాల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని ఖాతాలను చురుగ్గా నిర్వహించడం చాలా మందికి కష్టమవుతుంది. కొన్ని ఖాతాలలో కనీస బ్యాలెన్స్ కూడా మెయింటెయిన్ చేయలేకపోవడంతో వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తుంటారు. ఇలా దీర్ఘకాలంగా లావాదేవీలు జరగని ఖాతాలపైనే బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. కాబట్టి, పీఎన్‌బీలో వాడకుండా ఖాతా ఉన్నవారు వెంటనే స్పందించి, కేవైసీ పూర్తి చేసుకోవడం మంచిది.


More Telugu News