ఇరాన్ భద్రతా వ్యవహారాల చీఫ్ అలీ లారిజానీని చంపేశాం: ఇజ్రాయెల్

ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ భద్రతా వ్యవహారాల చీఫ్ అలీ లారిజానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అధికారికంగా ధృవీకరించారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను మరింత దట్టం చేస్తోంది.

ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, రాత్రివేళ ఇరాన్‌లోని సీనియర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ దాడిలో లారిజానీతో పాటు ఇరాన్ బసిజ్ పారామిలటరీ దళాల అధిపతి ఘోలంరెజా సొలైమానీ కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

అలీ లారిజానీ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీకి ఆయన అత్యంత నమ్మకస్తుడిగా, కుడిభుజంగా పేరుగాంచారు. ఖమేనీ మరణానంతరం ఇరాన్ భద్రతా వ్యవస్థలో లారిజానీ అత్యంత కీలకమైన వ్యక్తిగా మారారు.

ఖమేనీ మరణంతో ఇరాన్‌లో ఇప్పటికే తాత్కాలిక నాయకత్వ మండలి పాలన సాగిస్తోంది. ఇలాంటి సమయంలో జరిగిన ఈ దాడి దేశంలో రాజకీయ అస్థిరతను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లక్ష్యిత దాడి ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News