నటి ప్రత్యూష మృతి కేసు: అమెరికా నుంచి వచ్చి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి

సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో 24 ఏళ్ల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. సుప్రీం కోర్టు విధించిన నాలుగు వారాల గడువు ముగియడంతో, అమెరికా నుంచి నగరానికి వచ్చిన అతడు న్యాయస్థానం ముందు హాజరయ్యాడు.

2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి ఓ కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. తన కుమార్తెది హత్యేనని ప్రత్యూష తల్లి ఆరోపిస్తూ దశాబ్దాలుగా న్యాయపోరాటం చేశారు.

విచారణ జరిపిన ట్రయల్ కోర్టు, ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై సిద్ధార్థ రెడ్డిని దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశాడు. అయితే, ఐదేళ్ల శిక్షను హైకోర్టు రెండేళ్లకు తగ్గించింది. అయినప్పటికీ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సిద్థార్థరెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అతడు కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది. పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.


More Telugu News