సమాచారం ఇవ్వకుండానే ఇరాన్ దాటుతున్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచన

ఎంబసీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఇరాన్ సరిహద్దును దాటి వేరే దేశాల మీదుగా స్వదేశానికి చేరుకోవాలనుకునే భారతీయులకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా లేదా తమతో సమన్వయం చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దు దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

ఇరాన్‌లోని భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన చోట సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సరిహద్దు దాటడం సరికాదని సూచించింది. రాయబార కార్యాలయం సహకారం లేకుండా సరిహద్దుల ద్వారా ఇరాన్‌ను దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తే రవాణా, ఇమ్మిగ్రేషన్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హితవు పలికింది.

ఒక్కసారి ఇరాన్‌ను దాటి మరో దేశం ద్వారా భారత్ చేరుకోవాలని ప్రయత్నించి, ఇతర దేశాల్లో చిక్కుకుపోతే సాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ఇరాన్‌లోని భారతీయులంతా తమ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరింది.


More Telugu News