పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
గత 15 ఏళ్లుగా వైసీపీ ప్రజల పక్షాన నిలబడిందని, ఇప్పుడు 16వ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని, అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని అన్నారు.
ముఖ్యంగా టీడీపీ సాగిస్తున్న తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని సజ్జల చెప్పారు. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.