సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరు మారింది!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' టైటిల్‌ మారింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' అనే కొత్త టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది.

కొత్త టైటిల్‌తో పాటు "యుద్ధానికి శాంతి చేకూరాలి" (May War Rest in Peace) అనే బలమైన సందేశంతో కూడిన ఆకట్టుకునే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో, మేకులు కొట్టిన కర్ర దుంగ వెనుక నుంచి సల్మాన్ ఖాన్ తీక్షణంగా చూస్తున్నట్టుగా కనిపించారు. ఈ కొత్త టైటిల్, దాని వెనుక ఉన్న సందేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా ఈ సినిమాను అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అమలు చేసే బాధ్యతను నిర్వర్తించిన 16వ బీహార్ రెజిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తుండగా, అభిలాష్ చౌదరి, అంకుర్ భాటియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిమేష్ రేషమియా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్‌లో సైనికుడి పాత్ర కోసం మీసంతో, రగ్డ్డ్ అవతార్‌లో సల్మాన్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


More Telugu News