దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం ప్రకటన

వంటగ్యాస్ కొరత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100 శాతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎల్పీజీ స్టాక్ గృహావసరాలకు సరిపోయేంత ఉందని తెలిపింది. పెట్రోల్, డీజిల్ కూడా తగినంత అందుబాటులో ఉందని కేంద్రం తెలిపింది. అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేసింది.

పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ క్యారియర్ హర్మూజ్ జలసంధిని దాటి భారతదేశం సమీపానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నేడు సాయంత్రం 5 గంటలకు ఈ క్యారియర్ భారత్ చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

పశ్చిమాసియా ప్రాంతంలోని అన్ని భారత నౌకలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రతి నౌకలోని సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మందితో కూడిన 22 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


More Telugu News