పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

పదమూడేళ్లుగా కోమాలో జీవచ్ఛవంలా ఉన్న హరీశ్ రాణాకు శాశ్వత విశ్రాంతిని ప్రసాదించే ప్రక్రియ మొదలైంది. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో, కారుణ్య మరణం (passive euthanasia) కోసం అతడిని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. కుటుంబ సభ్యులు గుండె రాయి చేసుకుని, కన్నీటితో అతడికి వీడ్కోలు పలికారు.

2013లో ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉన్న 19 ఏళ్ల హరీశ్ రాణా తాను నివాసముంటున్న భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి శాశ్వత అపస్మారక స్థితిలోకి (persistent vegetative state) వెళ్లిపోయాడు. ట్యూబుల ద్వారా ఆహారం, శ్వాస అందిస్తూ 13 ఏళ్లుగా అతడిని బతికించారు. కొడుకు కోలుకునే అవకాశం లేదని, అతడికి గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించాలని తండ్రి అశోక్ రాణా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 11న కీలక తీర్పు వెలువరించింది. హరీశ్ కోలుకోవడం అసాధ్యమని వైద్య బృందాలు నిర్ధారించడంతో, అతడికి అందిస్తున్న కృత్రిమ జీవనాధారాన్ని తొలగించాలని ఆదేశించింది. ఇది మరణాన్ని ఎంచుకోవడం కాదని, కృత్రిమంగా జీవితాన్ని పొడిగించకుండా ఉండటమేనని కోర్టు వ్యాఖ్యానించింది.

శనివారం ఘజియాబాద్‌లోని నివాసం నుంచి హరీశ్‌ను ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ పాలియేటివ్ కేర్ విభాగం వైద్యుల పర్యవేక్షణలో అతడికి అందిస్తున్న పోషకాలు, ద్రవాలను నెమ్మదిగా నిలిపివేసి, సహజంగా మరణించేలా ఏర్పాట్లు చేస్తారు. కోర్టు ఆదేశాలతో భారత్‌లో కారుణ్య మరణం అమలు కావడం ఇదే తొలిసారి. "ఒక తండ్రిగా ఇది చాలా బాధాకరం. ఏ తల్లిదండ్రులూ తమ కుమారుడిని ఈ స్థితిలో చూడాలనుకోరు" అని తండ్రి అశోక్ రాణా ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News