పోలవరానికి కేంద్రం రూ.1,508 కోట్లు.. ఖర్చుకు నేడే డెడ్‌లైన్!

  • మార్చి 15లోగా ఖర్చు చేయాలంటూ కీలక షరతు
  • ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇది మూడో విడత అడ్వాన్స్
  • రాష్ట్ర అభ్యంతరంతో పాత విధానంలోనే నిధుల బదిలీ
  • ప్రాజెక్టు ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు జమ
పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మూడో విడత నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.1,508 కోట్లను అడ్వాన్స్‌గా అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ నిధులను మార్చి 15వ తేదీలోగా ఖర్చు చేయాలని, అలా చేస్తేనే ప్రస్తుత బడ్జెట్‌లో మిగిలిన నిధులను ఇస్తామని కీలక షరతు విధించింది. 

గతంలో ఇచ్చిన అడ్వాన్స్‌లో 80 శాతానికి పైగా ఖర్చు చేసినందున, మూడో విడత నిధులను ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరానికి ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తం రూ.7,020 కోట్లు అడ్వాన్స్‌గా అందినట్లు తెలుస్తోంది.

నిధుల విడుదల విషయంలో తొలుత కేంద్ర ఆర్థిక శాఖ 'స్పర్శ్' విధానాన్ని పాటించాలని సూచించగా, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. పాత సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA) విధానంలోనే నిధులు ఇవ్వాలని కోరడంతో కేంద్రం అంగీకరించింది. కేంద్రం నుంచి నిధులు అందగానే, రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే రూ.500 కోట్లను పోలవరం ఖాతాకు బదిలీ చేసింది.

ఈ నిధులతో ప్రాజెక్టు పనులకు రూ.500 కోట్లు, పునరావాస కార్యక్రమాలకు మరో రూ.500 కోట్లు వెచ్చించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరానికి (2025-26) పోలవరం కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.3,320 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

Polavaram Project
Andhra Pradesh
Central Government Funds
Polavaram Funds Release
Jal Shakti Ministry
National Project
AP Government
Polavaram Authority
SNA
SPARSH

More Telugu News