ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెవిన్ పీటర్సన్ గుడ్ బై.. కామెంటరీ బాక్స్‌లో కలుసుకుందాం అంటూ కామెంట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఫ్రాంచైజీకి వీడ్కోలు పలుకుతున్నట్టు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తెలిపాడు. జట్టు మెంటార్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించాడు. అయితే, ఈ లీగ్ లో గతంలో మాదిరే కామెంటేటర్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు.

గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం పీటర్సన్‌ను మెంటార్‌గా నియమించింది. హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మోట్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ వంటి సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి కేపీ పనిచేశాడు. "ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా కొనసాగలేను. ఈ బాధ్యతలకు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. అయితే, కామెంటరీ బాక్స్‌లో మళ్లీ కలుస్తాను" అని 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశాడు.

దక్షిణాఫ్రికాలో జన్మించిన పీటర్సన్, ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు ఆడాడు. 2010 టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచి ఇంగ్లండ్‌కు తొలి ఐసీసీ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పుణే జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

ఇదిలా ఉండగా, బీసీసీఐ ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు తలపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా పూర్తి షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.




More Telugu News