హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లికి నో చెప్పిందని యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు

హైదరాబాద్‌లోని పోచారం ప్రాంతంలో అత్యంత అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు, యువతికి హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్‌ ద్వారా బలవంతంగా ఎక్కించాడు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను తలపించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే... పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడు ఎయిడ్స్ బాధితుడు. అతనికి, అతని తల్లిదండ్రులకు కూడా ఈ వ్యాధి ఉంది. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టి ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న మనోహర్, ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల‌ 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె అందుకు ససేమిరా అనడంతో తన వెంట తెచ్చుకున్న సిరంజిలోని హెచ్‌ఐవీ రక్తాన్ని ఆమె శరీరంలోకి బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


More Telugu News