రష్యా చమురు కొనమని ఇండియా సహా ప్రపంచాన్ని అడుక్కుంటున్నారు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్

అంతర్జాతీయ చమురు దౌత్యంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనవద్దని దేశాలపై ఒత్తిడి చేసిన అగ్రరాజ్యం ఇప్పుడు అదే రష్యా చమురును కొనాలంటూ బతిమాలుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ విమర్శించారు. అమెరికా తీరును సోషల్ మీడియా వేదికగా ఆయన ఎద్దేవా చేశారు.

ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి బ్యారెల్ ధర 100 డాలర్లు దాటింది. ఈ నేపథ్యంలో చమురు మార్కెట్‌ను స్థిరీకరించేందుకు అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురు నౌకల కొనుగోలుకు వీలుగా ఆంక్షలపై 30 రోజుల పాటు మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు ఏప్రిల్ 11 వరకు వర్తిస్తుందని అమెరికా ట్రెజరీ విభాగం స్పష్టం చేసింది.

ఈ యుద్ధ వాతావరణంలోనూ భారత్‌తో తమ స్నేహబంధాన్ని ఇరాన్ కొనసాగిస్తోంది. భారత్‌కు వస్తున్న రెండు ఎల్‌పీజీ గ్యాస్ నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటేందుకు అనుమతించింది. "భారత్, ఇరాన్ మంచి మిత్రదేశాలు. మాకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. భారత నౌకలకు ఎల్లప్పుడూ సురక్షిత మార్గం ఉంటుంది" అని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ హామీ ఇచ్చారు.


More Telugu News