ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారా?: అమెరికా ఏమన్నదంటే...!

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన గుర్తుపట్టలేని విధంగా మారినట్లు అమెరికా భావిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మొజ్తబా ఖమేనీ గాయపడ్డారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. దాడుల నేపథ్యంలో ఇరాన్ నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అన్నారు.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం 14వ రోజుకు చేరుకుంది. మొదటి రోజునే సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మృతి చెందారు. దీంతో ఇటీవలే మొజ్తబాను సుప్రీం లీడర్‌గా ప్రకటించారు. అయితే, వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన మొజ్తబా కోమాలో ఉన్నారని, ఒక కాలు కూడా కోల్పోయారని అంతకుముందు కథనాలు వచ్చాయి.

మొజ్తబా గాయపడ్డారని తమకు తెలుసని రక్షణ మంత్రి అన్నారు. ఎందుకంటే ఆయన పేరిట నిన్న విడుదలైన ప్రకటనలో ఆయన వాయిస్ కానీ, వీడియో కానీ లేదని పేర్కొన్నారు. అది కేవలం రాతపూర్వక ప్రకటన మాత్రమే అన్నారు. అసలు అతను అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటాడని అన్నారు.

ఇరాన్ వద్ద వాయిస్ రికార్డర్లు ఉన్నాయని, అత్యాధునిక కెమెరాలు ఉన్నాయని... అయినప్పటికీ రాతపూర్వక ప్రకటన ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ రాతపూర్వక ప్రకటన వెనుక అసలు విషయం అర్థమవుతోందని పీట్ హెగ్సెత్ తెలిపారు. అతను ఈ దాడులతో భయపడ్డాడని, దాడిలో గాయపడ్డాడని అర్థమవుతోందని అన్నారు.


More Telugu News