పిల్లల్ని కనడంపై వరలక్ష్మి శరత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
- మన దేశంలో పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారన్న వరలక్ష్మి
- ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని బాధపడుతున్నారని విమర్శ
- పోషించే స్తోమత ఉన్నప్పుడే పిల్లలను కనాలని వ్యాఖ్య
నటి వరలక్ష్మి శరత్కుమార్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. జనాభా నియంత్రణకు, ఆర్థిక స్థోమతను పిల్లలను కనడానికి ముడిపెడుతూ ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
"మన దేశంలో సెక్స్ గురించి ఎవరూ మాట్లాడరు కానీ, జనాభాలో మాత్రం మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారు, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని బాధపడతారు. కనే ముందే సరైన ప్లాన్ ఉండాలి కదా" అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక బిడ్డను పెంచి, చదివించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అందుకే ఇంకొకరిని పోషించే స్తోమత ఉన్నప్పుడే పిల్లలను కనాలని ఆమె సూచించారు.
చాలామంది తమ పిల్లల చదువుల కోసం లేదా ఆర్థిక సాయం కోసం తన దగ్గరకు వస్తుంటారని చెప్పిన వరలక్ష్మి... "ఆ పిల్లలకు నేనేమైనా జన్మనిచ్చానా? మీ తప్పులకు నేను ఎందుకు బాధ్యత వహించాలి?" అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆమెకు ప్రియమణి, మంచు లక్ష్మి కూడా మద్దతుగా నిలిచారు.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు:
మద్దతుగా: "ఆమె చెప్పింది కఠినమైన నిజం. బాధ్యత లేకుండా పిల్లలను కని వారిని ఇబ్బందుల్లోకి నెట్టడం కంటే, ప్లానింగ్ ఉండటం మంచిది" అని కొందరు నెటిజన్లు ఆమెను సమర్థిస్తున్నారు.
వ్యతిరేకంగా: "డబ్బు ఉన్న వారే పిల్లలను కనాలనడం అహంకారం. 40 ఏళ్లలో సెటిల్ అయ్యాక పిల్లలు పుడతారన్న గ్యారెంటీ ఏంటి?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పేదవారికి పిల్లలను కనే హక్కు లేదా అంటూ ఆమె వ్యాఖ్యలను మరికొందరు తప్పుబడుతున్నారు.