పాక్ క్రికెటర్‌ను కొన్న సన్‌రైజర్స్.. బీసీసీఐ ఏమందంటే?

  • ‘ది హండ్రెడ్’ లీగ్‌లో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
  • భారత సైన్యంపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రేగిన దుమారం
  • ఇది విదేశీ లీగ్ వ్యవహారం, తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన బీసీసీఐ
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానిదే ఈ ఫ్రాంచైజీ కావడంతో విమర్శలు
  • కావ్యా మారన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్ల అసంతృప్తి
ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్’ క్రికెట్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారత యాజమాన్యంలోని సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత సైన్యాన్ని కించపరిచేలా గతంలో వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడిని తీసుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఇది తమ పరిధిలోని అంశం కాదని, విదేశీ లీగ్‌కు సంబంధించిన విషయం కాబట్టి ఫ్రాంచైజీయే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "మేం ఇందులో ఏమీ చేయలేం" అని ఆయన స్ప‌ష్టం చేశారు.

లండన్‌లో జరిగిన వేలంలో పాక్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ రూ.2.34 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గతేడాది ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో అబ్రార్ భారత సైన్యం, వాయుసేనను ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిని తీసుకోవడంపై సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్‌పై అభిమానులు, నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గతంలో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌గా ఉన్న ఈ ఫ్రాంచైజీని, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యమైన సన్ టీవీ గ్రూప్ పూర్తిస్థాయిలో కొనుగోలు చేసింది. ఇప్పటివరకు సన్‌రైజర్స్ యాజమాన్యంలోని ఏ జట్టు కూడా పాకిస్థాన్‌కు చెందిన యాక్టివ్ అంతర్జాతీయ ఆటగాడిని తీసుకోలేదు. ఈ లీగ్‌లో ఒక భారత యాజమాన్యంలోని జట్టు పాక్ ఆటగాడిని తీసుకోవడం ఇదే తొలిసారి.

భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2008 నుంచి ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లు ఆడటం లేదు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు ‘ది హండ్రెడ్’ లీగ్‌లో పాక్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం విధిస్తాయని ప్రచారం జరిగింది. అయితే, దానికి భిన్నంగా ఈ కొనుగోలు జరగడం గమనార్హం. ఇదే వేలంలో మరో పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు కొనుగోలు చేసింది.


More Telugu News