: ఇరాక్ సమీపంలో యూఎస్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. భారత నావికుడి మృతి

  • అండర్‌వాటర్ డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ వెల్ల‌డి
  • బాధితులకు అండగా నిలిచిన భారత రాయబార కార్యాలయం
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన జరగడంతో పెరిగిన ఆందోళన
పర్షియన్ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇరాక్ సమీపంలో అమెరికాకు చెందిన ముడి చమురు ట్యాంకర్‌పై ఇరాన్ జరిపిన దాడిలో భారతీయ సిబ్బంది ఒకరు మరణించారు. ఈ ఘటనలో మరో 15 మంది భారతీయులను సురక్షితంగా కాపాడినట్లు బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న "సేఫ్‌సీ విష్ణు" అనే ఈ నౌకపై బుధవారం దాడి జరిగింది.

ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాక్ ప్రాదేశిక జలాల్లో రెండు ఆయిల్ ట్యాంకర్లను అండర్‌వాటర్ డ్రోన్లతో పేల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో యూఎస్ యాజమాన్యంలోని సేఫ్‌సీ విష్ణుతో పాటు గ్రీస్‌కు చెందిన మాల్టా జెండాతో ఉన్న "జెఫిరోస్" అనే మరో ట్యాంకర్ కూడా లక్ష్యంగా మారింది. 

ఈ ఘటనపై బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. "నిన్న‌ జరిగిన ఈ దాడిలో భారతీయ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. మిగిలిన 15 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించాం" అని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా తెలిపింది. రక్షించబడిన భారతీయ నావికులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొంది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

గత 12 రోజులుగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్య కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ప్రపంచంలోని 20 శాతం చమురు సరఫరా జరిగే హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలను తగలబెడతామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. ఈ దాడులతో సముద్ర వాణిజ్యానికి తీవ్ర అంతరాయం కలగడంతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. మరోవైపు ఈ ప్రాంతంలో ముప్పును ఎదుర్కోవడానికి తమ బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది.

More Telugu News