ప్రపంచం అల్లాడిపోతున్నా చైనాకు మాత్రం బేఫికర్.. ఇరాన్ నుంచి చైనాకు ఆగని చమురు సరఫరా

  • యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి 1.17 కోట్ల బారెళ్ల ఎగుమతి
  • హర్మూజ్ జలసంధిని మూసివేసి నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్
  • ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరాలో అంతరాయం
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, ఇరాన్ తన ఆర్థిక మూలాలను కాపాడుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ సుమారు 11.7 మిలియన్ బారెళ్ల ముడి చమురును హర్మూజ్ జలసంధి ద్వారా చైనాకు విజయవంతంగా తరలించింది. అంతర్జాతీయంగా అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను ధిక్కరిస్తూ ఇరాన్ ఈ స్థాయిలో ఎగుమతులు చేయడం గమనార్హం.

ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉండటం దానికి కలిసొచ్చే అంశంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా లతో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, తన నౌకల ద్వారా చైనాకు నిరంతరాయంగా చమురును సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఇరాన్ చమురును అందిస్తుండటంతో చైనా తన ఇంధన అవసరాల కోసం ఆ దేశంతో వాణిజ్యాన్ని మరింత పెంచుకుంది.

ఈ చమురు విక్రయాల ద్వారా అందుతున్న భారీ రాబడి, ప్రస్తుతం యుద్ధంలో ఉన్న ఇరాన్‌కు అతిపెద్ద ఆర్థిక మద్దతుగా మారింది. ఒకవైపు, ఇరాన్ ఈ జలసంధిలో సీమైన్స్ అమర్చి ఇతర దేశాల నౌకలను అడ్డుకోవాలని చూస్తూ, మరోవైపు తన మిత్రదేశమైన చైనాకు మాత్రం భారీగా సరఫరాను కొనసాగించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. చైనాకు అందుతున్న ఈ చమురు సరఫరా ఇరాన్ తన యుద్ధ ఖర్చులను తట్టుకోవడానికి ప్రధాన వనరుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News