హార్దిక్ పాండ్యాపై పోలీసులకు ఫిర్యాదు.. చిక్కుల్లో టీమిండియా ఆల్‌రౌండర్

  • క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై పుణె పోలీసులకు ఫిర్యాదు
  • జాతీయ జెండాను అవమానించారని అడ్వకేట్ వాజిద్ ఖాన్ ఆరోపణ
  • విజయోత్సవ వేడుకల్లో జెండాను ఒంటికి చుట్టుకొని అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పుణెలో పోలీసులకు ఫిర్యాదు అందింది. టీ20 ప్రపంచకప్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను అవమానించారని ఆరోపిస్తూ, ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఓ న్యాయవాది డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల న్యూజిలాండ్‌పై టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం అహ్మదాబాద్‌లోని స్టేడియంలో టీమిండియా సంబరాలు చేసుకుంది. ఈ వేడుకల్లో హార్దిక్ పాండ్యా త్రివర్ణ పతాకాన్ని తన ఒంటికి చుట్టుకుని, మైదానంలో అసభ్యంగా ప్రవర్తించారని అడ్వకేట్ వాజిద్ ఖాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. "హార్దిక్ చర్య జెండా గౌరవానికి భంగం కలిగించేలా ఉంది. ఇది చట్ట ప్రకారం నేరం. జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి విధి" అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

కాగా, ఈ టోర్నమెంట్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్‌లో రెండు అర్ధ సెంచరీలు చేయడంతో పాటు, బౌలింగ్‌లో కీలక సమయాల్లో 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఐసీసీ ప్రకటించిన 'టీమ్ ఆఫ్ ది 2026 టీ20 వరల్డ్ కప్' జట్టులో కూడా హార్దిక్‌కు చోటు దక్కింది.


More Telugu News