స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు

  • నిన్నటి భారీ లాభాల తర్వాత తగ్గిన బంగారం, వెండి ధరలు
  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • దిగివస్తున్న ముడిచమురు ధరలతో తగ్గిన ద్రవ్యోల్బణ భయాలు
నిన్న‌ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇవాళ‌ కాస్త దిగొచ్చాయి. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బులియన్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిన్నటి సెషన్‌లో దాదాపు 2 శాతం పెరిగిన పసిడి, 4 శాతం దూసుకెళ్లిన వెండి నేడు స్వల్పంగా త‌గ్గాయి.

ఈ రోజు ఉదయం 11:15 గంటల సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.52శాతం నష్టపోయి 10 గ్రాములకు రూ. 1,62,452 వద్ద ట్రేడ్ అయింది. అలాగే, మే సిల్వర్ ఫ్యూచర్స్ 1.69 శాతం క్షీణించి కిలోకు రూ. 2,73,150 వద్దకు చేరింది. ఇక‌, అమెరికా డాలర్ బలహీనపడటం, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పసిడి పతనాన్ని కొంతవరకు అడ్డుకున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.07 శాతం తగ్గి 98.75 వద్ద ఉంది. డాలర్ బలహీనపడితే ఇతర కరెన్సీలు కలిగిన వారికి బంగారం కొనుగోలు చౌకగా మారుతుంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోవడం కూడా పసిడిపై ప్రభావం చూపింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) భారీ స్థాయిలో అత్యవసర నిల్వలను విడుదల చేయాలని ప్రతిపాదించడంతో చమురు ధరలు గత నాలుగు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 11 శాతం పతనమయ్యాయి. చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణ భయాలు చల్లారాయి. దీంతో ద్రవ్యోల్బణానికి విరుగుడుగా భావించే బంగారానికి డిమాండ్ కొంత తగ్గింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై చేస్తున్న గందరగోళ ప్రకటనలు, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై తీవ్ర వైమానిక దాడులు చేయడం వంటి పరిణామాలు మార్కెట్‌లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రస్తుతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం వెలువడనున్న అమెరికా వ్యక్తిగత వినియోగ వ్యయాల (PCE) సూచీపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి. ఈ గణాంకాలు ద్రవ్యోల్బణం పోకడను, ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి.


More Telugu News