Shoaib Akhtar: టీమిండియా ఓ ధనిక పిల్లాడిలాంటిది.. అందరినీ పిలిచి ఓడించే గల్లీ దాదా: షోయబ్ అక్తర్

Shoaib Akhtar Praises Indian Cricket System After World Cup Win
  • టీమిండియా గెలుపును గల్లీ క్రికెట్‌తో పోల్చిన షోయబ్ అక్తర్
  • అందరినీ పిలిచి ఓడించే ధనిక పిల్లాడిలా భారత్ ఉందని వ్యాఖ్య
  • భారత క్రికెట్ వ్యవస్థ, విధానాలను ప్రశంసించిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్
  • 2027 వన్డే వరల్డ్ కప్‌లోనూ భారతే ఫేవరెట్ అని జోస్యం
  • సంజూ శాంసన్ పరిణతి చెందిన ఆటగాడంటూ ప్రత్యేక ప్రశంస
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ రికార్డు స్థాయిలో మూడోసారి ట్రోఫీని గెలుచుకోవడంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆధిపత్యాన్ని ఓ గల్లీలోని ధనిక పిల్లాడితో పోలుస్తూ సెటైర్లు వేశాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

పీటీవీ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో అక్తర్ మాట్లాడుతూ... "గల్లీలో ఉండే ఓ ధనిక పిల్లవాడు పేద పిల్లలందరినీ క్రికెట్ ఆడటానికి పిలుస్తాడు. కానీ, గెలవాల్సింది మాత్రం తనే. ఇప్పుడు భారత్ కూడా మాతో అదే చేస్తోంది. 8 జట్లలో 4 మిగిలితే, వాళ్లను ఓడించి... ఇదిగో నేను గెలిచాను అంటోంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

అదే సమయంలో భారత క్రికెట్ వ్యవస్థను అక్తర్ ప్రశంసలతో ముంచెత్తాడు. "ఇది వారి విధానాలు, వ్యవస్థ, ప్రతిభకు నిదర్శనం. గౌతమ్ గంభీర్ రిస్క్ తీసుకుని సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకువచ్చాడు. అభిషేక్ శర్మ ఇంకా చాలా నేర్చుకోవాలి. కానీ, శాంసన్ చాలా పరిణతి చెందిన ఆటగాడు" అని మెచ్చుకున్నాడు.

భారత్ దూసుకెళుతున్న వేగాన్ని చూస్తుంటే ఇతర దేశాలకు ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయని అక్తర్ అన్నాడు. "సరైన ఆటగాళ్లకు ఎలా అవకాశాలివ్వాలో భారత్ నిరూపించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన వెంటనే భారత్ వరల్డ్ కప్ గెలిచింది. ఈ జోరు చూస్తుంటే 2027 వన్డే ప్రపంచకప్‌లోనూ భారతే ఫేవరెట్" అని జోస్యం చెప్పాడు.
Shoaib Akhtar
T20 World Cup
India vs New Zealand
Indian Cricket Team
Suryakumar Yadav
Gautam Gambhir
Sanju Samson
Abhishek Sharma
Cricket World Cup 2027
Cricket

More Telugu News