భారత 'బ్రహ్మోస్‌'కు పెరుగుతున్న డిమాండ్.. తాజాగా ఇండోనేషియా డీల్

  • భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయనున్న ఇండోనేషియా
  • ఒప్పందాన్ని అధికారికంగా ధృవీకరించిన ఇండోనేషియా రక్షణ శాఖ
  • సముద్ర భద్రత, సైనిక ఆధునికీకరణలో భాగంగానే ఈ నిర్ణయం
  • ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్‌ను కొనుగోలు చేస్తున్న రెండో దేశం ఇండోనేషియా
  • 'ఆపరేషన్ సిందూర్' విజయం తర్వాత బ్రహ్మోస్‌పై పెరిగిన అంతర్జాతీయ ఆసక్తి
భారత రక్షణ ఎగుమతులకు మరో పెద్ద విజయం దక్కింది. అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ముందుకు వచ్చింది. ఈ మేరకు భారత్‌తో ఒప్పందం కుదిరినట్టు ఇండోనేషియా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

సముద్ర రంగంలో సైనిక హార్డ్‌వేర్‌ను ఆధునికీకరించడంతో పాటు, రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇండోనేషియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రికో రికార్డో సిరైత్ ‘రాయిటర్స్’ వార్తా సంస్థకు వివరించారు. చాలాకాలంగా సాగుతున్న చర్చలు, 2025లో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఈ ఒప్పందంపై వేగంగా పురోగతి సాధించారు.

భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తున్న రెండో విదేశీ దేశం ఇండోనేషియా. 2022లోనే ఫిలిప్పీన్స్ 375 మిలియన్ డాలర్ల ఒప్పందంతో మూడు బ్రహ్మోస్ బ్యాటరీలను కొనుగోలు చేయగా, 2024లో తొలి విడత డెలివరీలు పూర్తయ్యాయి. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణిని భూమి, గగనతలం, నౌకలు, జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించవచ్చు.

ఇటీవల 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్లో బ్రహ్మోస్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ క్షిపణి విజయం తర్వాత భారత నౌకాదళం, వాయుసేన కోసం మరిన్ని బ్రహ్మోస్ సిస్టమ్‌ల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణిపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగింది.


More Telugu News