గంభీర్ పాలసీ సూపర్ హిట్... బీసీసీఐ సిస్టమ్ గెలిచింది: షోయబ్ అక్తర్

  • టీ20 వరల్డ్ కప్ 2026 ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాపై షోయబ్ అక్తర్ ప్రశంసలు
  • కోహ్లీ, రోహిత్ శర్మలను పక్కనపెట్టి సరైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్య
  • యువ ఆటగాళ్లను ప్రోత్సహించిన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు అద్భుతమన్న పాక్ దిగ్గజం
  • బీసీసీఐ సిస్టమ్, రంజీ క్రికెటర్లకు అందుతున్న మద్దతు వల్లే ఈ విజయం సాధ్యమైందని వెల్లడి
  • ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టైటిల్ నిలబెట్టుకున్న భారత జట్టు
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను నిలబెట్టుకున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, మూడోసారి టీ20 కప్‌ను ముద్దాడిన టీమిండియాపై పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలను పక్కనపెట్టి కొత్త జట్టును తయారు చేయాలన్న భారత్ నిర్ణయం నూటికి నూరు శాతం సరైనదేనని ఈ విజయంతో రుజువైందని కొనియాడాడు.

2024 టీ20 వరల్డ్ కప్ విజయానంతరం రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత రోహిత్, కోహ్లీ, జడేజా లాంటి సీనియర్లు ఈ ఫార్మాట్‌కు దూరం కాగా.. గంభీర్ పూర్తిగా 'టీమ్ ఫస్ట్' అనే ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లాడు. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ కొత్త జట్టును నిర్మించాడు. ఈ పరిణామాలపై పాకిస్థాన్ మీడియా చానల్ 'ట్యాప్‌మాడ్'తో మాట్లాడిన అక్తర్.. భారత క్రికెట్ వ్యవస్థను ఆకాశానికెత్తాడు.

"భారత్ పాలసీ గెలిచింది. వారి సిస్టమ్, మేనేజ్‌మెంట్ గెలిచాయి. 2024 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో భాగమైన కెప్టెన్ రోహిత్ శర్మ, లెజెండ్ విరాట్ కోహ్లీలను వారు వదిలేశారు. ఆ దిగ్గజాలను పక్కనపెట్టి ముందుకు సాగారు. వారు తీసుకున్న ఆ నిర్ణయం ఎంత సరైనదో ఈ రోజు ప్రపంచానికి రుజువు చేశారు" అని అక్తర్ విశ్లేషించాడు. గౌతమ్ గంభీర్ అందరితో పోరాడి మరీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి అండగా నిలిచాడని ప్రశంసించాడు. అభిషేక్ శర్మ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేయగలడని గంభీర్ నమ్మాడని, ఆ నమ్మకమే ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు.

బీసీసీఐ వ్యవస్థ పనితీరును కూడా అక్తర్ ప్రత్యేకంగా అభినందించాడు. రంజీ ఆడుతున్న క్రికెటర్లకు ఆర్థిక భరోసా కల్పించడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడం, అదే సమయంలో రోహిత్, ధోని లాంటి సీనియర్లను గౌరవించే విధానం అద్భుతమన్నారు. కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరిగితే విజయాలు వాటంతట అవే వస్తాయని స్పష్టం చేశాడు.

ఇక టోర్నీ సాగిన తీరును గమనిస్తే.. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన భారత్, ఫైనల్‌లో ఏకంగా 96 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కివీస్‌ను 159 పరుగులకే కట్టడి చేసి సత్తా చాటింది. తద్వారా రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 కప్ ను చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో, పాత దిగ్గజాల స్థానంలో వచ్చిన కొత్త తరం ఆటగాళ్లు బాధ్యతను భుజానికెత్తుకుని అద్భుతాలు చేయడమే భారత క్రికెట్ విజయ రహస్యమని షోయబ్ అక్తర్  వ్యాఖ్యానించాడు.


More Telugu News