కప్ గెలిచాక ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఎమోషనల్... వీడియో విడుదల చేసిన బీసీసీఐ

  • టీ20 వరల్డ్ కప్ 2026 గెలవడంపై స్పందించిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ
  • 2023 వన్డే వరల్డ్ కప్ బాధను ఇప్పుడు మర్చిపోయామన్న ఇషాన్
  • సొంతగడ్డపై కప్పు గెలవడం చరిత్రాత్మకం అని హర్షం
  • తాను ఫామ్ కోల్పోయినప్పుడు జట్టు అండగా నిలిచిందన్న అభిషేక్
  • తమ సంతోషాన్ని పంచుకున్న యువ క్రికెటర్లు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకోవడంపై టీమిండియా ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఎమోషనల్ అయ్యారు. ఈ చరిత్రాత్మక విజయం తర్వాత వారిద్దరూ తమ ఆనందాన్ని పంచుకున్న ఒక వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ఆతిథ్య దేశం టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే తొలిసారి అని గుర్తుచేశాడు. "మేము ప్రాణం పెట్టి ఆడాం. టోర్నీ ఆసాంతం ఒకరికొకరు అండగా నిలబడ్డాం. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో అందరం ఏడ్చాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సపోర్ట్ స్టాఫ్, జట్టు సభ్యులందరి కృషితోనే ఈ ట్రోఫీని ఎత్తగలిగాం" అని ఇషాన్ ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ టోర్నీలో తాను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు జట్టు అండగా నిలిచిన తీరును అభిషేక్ శర్మ గుర్తుచేసుకున్నాడు. "వరల్డ్ కప్ గెలవడం నా కెరీర్‌లోనే బెస్ట్ మూమెంట్. ఒక దశలో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాను. కానీ కోచ్‌లు, టీమ్ నాకు అండగా నిలిచారు. ఏ రోజూ నన్ను ఒంటరిగా వదిలేయలేదు. నా జట్టును చూసుకుంటే చాలా గర్వంగా ఉంది" అని అభిషేక్ భావోద్వేగానికి గురయ్యాడు.

పరుగులు రానప్పుడు కూడా అభిషేక్ చాలా పాజిటివ్‌గా ఉన్నాడని, ఇతరులకు సహాయం చేసేవాడని ఇషాన్ ప్రశంసించాడు. గత వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఇంట్లో కూర్చుని చూశానని, ఇప్పుడు స్వయంగా ఆడి కప్పు గెలవడం ఒక కల నిజమైనట్లుగా ఉందని అభిషేక్ శర్మ వివరించాడు.


More Telugu News