ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. తాడేపల్లి వాసుల దశాబ్దాల కల సాకారం

  • తాడేపల్లి రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌
  • రూ.294 కోట్లతో కృష్ణా నదికి వరద రక్షణ గోడ నిర్మాణం
  • 50 వేల మందికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం
  • పైల్-రాఫ్ట్ టెక్నాలజీతో భూకంపాలను తట్టుకునేలా నిర్మాణం
  • నులకపేటలో రూ.65 లక్షలతో కమ్యూనిటీ హాల్ ప్రారంభం
ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తన నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మరో కీలక హామీని నెరవేర్చారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తాడేపల్లి రిటైనింగ్ వాల్ (వరద రక్షణ గోడ) నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.294.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోనే పరిపాలన అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం.

ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నది కుడి వైపున 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీ వరకు ఈ గోడను నిర్మించనున్నారు. సాధారణ గోడలా కాకుండా భూమిలోకి 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేసి, ఆధునిక పైల్-రాఫ్ట్ సాంకేతికతతో దీన్ని నిర్మిస్తారు. భవిష్యత్తులో 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా, భూకంపాలు సంభవించినా తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు.

ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీ సహా పలు లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 50 వేల మంది ప్రజల వరద కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. అంతేకాకుండా అమరావతిలోని కొన్ని ప్రాంతాలకు, జాతీయ రహదారి 65కు కూడా ఈ గోడ రక్షణగా నిలుస్తుంది.

ఈ కార్యక్రమాలతో పాటు మంత్రి లోకేశ్‌ నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను కూడా ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు.


More Telugu News