ఈ సమయంలో కోహ్లీ గురించి చర్చ అవసరం లేదు: గౌతమ్ గంభీర్

  • ప్రతి విషయానికి కోహ్లీ పేరును తీసుకురావాల్సిన అవసరం లేదన్న గంభీర్
  • ఇప్పుడు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో అందరూ ఛాంపియన్స్ అని వ్యాఖ్య
  • విజయం సాధించిన వారి గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడాలన్న గంభీర్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను ముద్దాడిన వేళ, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


ప్రపంచ కప్ విజయం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరాట్ కోహ్లీ ప్రస్తావన రాగా, గంభీర్ తనదైన శైలిలో స్పందించారు. టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ కుప్పకూలిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాడి లోటు కనిపిస్తోందా? అని ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి గంభీర్ ఏమాత్రం తడబడకుండా, "అస్సలు మిస్ అవ్వలేదు.. ఒక్క శాతం కూడా మిస్ కాలేదు" అని స్పష్టం చేశారు. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లపై తనకు పూర్తి నమ్మకం ఉందని, బయట నుంచి ఎవరి అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.


అంతటితో ఆగకుండా, ప్రతి చిన్న విషయానికి విరాట్ కోహ్లీ పేరును తీసుకురావాల్సిన అవసరం లేదని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ రోజు మనం ప్రపంచ కప్ గెలిచాం.. ఈ జట్టులోని ఆటగాళ్లందరూ ఛాంపియన్స్. కాబట్టి విజయం సాధించిన వారి గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడాలి. ఈ సమయంలో కోహ్లీ గురించి చర్చ అనవసరం" అని గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ రక్తం అద్భుత ప్రదర్శనతో భారత్‌కు ట్రోఫీని అందించిన తరుణంలో, గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు కోహ్లీ అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలకు దారితీస్తున్నాయి.



More Telugu News