18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభం: సత్యకుమార్ యాదవ్

  • వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఏఐ టెక్నాలజీ
  • 40 అత్యాధునిక పరికరాల ద్వారా వ్యాధి నిర్ధారణ
  • సమయం ఆదా కావడమే కాకుండా, కచ్చితత్వంతో కూడిన చికిత్స అందుతుందన్న సత్యకుమార్

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సుమారు 40 అత్యాధునిక పరికరాల ద్వారా స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా, కచ్చితత్వంతో కూడిన చికిత్స అందుతుందని ఆయన పేర్కొన్నారు.


ముఖ్యంగా విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు వంటి ప్రధాన ఆసుపత్రుల్లో ఈ ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి. దగ్గు ద్వారా టీబీని గుర్తించడం, ఏఐ కెమెరాలతో సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ, గుండె జబ్బులు, చిన్నపిల్లల్లో నరాల సంబంధిత సమస్యలను పసిగట్టడం వంటి వినూత్న సేవలు ఇందులో ఉన్నాయి. రోగులు, వైద్యుల సంభాషణను రికార్డ్ చేయడం ద్వారా వైద్య చరిత్రను విశ్లేషించడం మరో విశేషం. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక రూపంలో అందించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.



More Telugu News