India vs New Zealand: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ వర్షం వ‌ల్ల‌ రద్దయితే విజేత ఎవరు?.. ఐసీసీ రూల్స్ ఇవే!

India vs New Zealand T20 World Cup Final if Rain Cancels Match ICC Rules
  • ఆదివారం టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ
  • మూడోసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న టీమిండియా
  • ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటన‌
  • గత రికార్డుల్లో న్యూజిలాండ్‌పై భారత్‌దే స్పష్టమైన ఆధిక్యం
టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రేపు జరిగే ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మూడోసారి టీ20 విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు తమ తొలి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడాలని కివీస్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఇలాంటి కీలక మ్యాచ్‌లకు వర్షం ముప్పు ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌లో కనీసం 10 ఓవర్ల చొప్పున ఆట నిర్వహించేందుకు నిర్ణీత సమయంతో పాటు అదనంగా 120 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఆదివారం ఈ సమయంలోగా కూడా ఆట సాధ్యపడకపోతే, మ్యాచ్‌ను మరుసటి రోజు, అంటే మార్చి 9న (సోమవారం) రిజర్వ్ డే రోజున నిర్వ‌హిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, ట్రోఫీని భారత్, న్యూజిలాండ్ జట్లకు పంచిపెట్టి సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

ఐసీసీ టోర్నమెంట్ల చరిత్రలో ఇలాంటి ఘటన ఒకసారి చోటుచేసుకుంది. 2002లో భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజున కూడా రద్దయింది. దీంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. అయితే, తీవ్రమైన ఎండ ఆటగాళ్లకు పెద్ద సవాలుగా మారనుంది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చని, రాత్రికి 23 డిగ్రీలకు పడిపోతుందని అంచనా. ఇక, ఇరు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే, పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు 30 సార్లు తలపడగా, భారత్ 18 మ్యాచ్‌లలో, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఈ లెక్కల ప్రకారం టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది.
India vs New Zealand
T20 World Cup Final
Ahmedabad
Narendra Modi Stadium
ICC Rules
Rain
T20 World Cup 2026
Reserve Day
Joint Winners

More Telugu News