నేపాల్‌లో కొత్త శకం.. ప్రభంజనం సృష్టిస్తున్న ర్యాపర్ బాలెన్ షా పార్టీ

  • నేపాల్ ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త పార్టీ హవా
  • ర్యాపర్ బాలెన్ షా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభంజనం
  • 110కి పైగా స్థానాల్లో ఆర్‌ఎస్‌పీ అభ్యర్థుల ఆధిక్యం
  • మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై బాలెన్ షా భారీ లీడ్ 
పొరుగు దేశం నేపాల్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. ర్యాపర్ నుంచి రాజకీయ నేతగా మారిన బాలేంద్ర (బాలెన్) షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ప్రభంజనం సృష్టిస్తోంది. దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ వంటి ప్రధాన పార్టీలను వెనక్కి నెడుతూ ఆర్‌ఎస్‌పీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. 

గురువారం జరిగిన పోలింగ్ అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపులో.. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యే 165 స్థానాలకు గాను ఆర్‌ఎస్‌పీ ఏకంగా 110కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఝాపా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని, సీపీఎన్-యూఎంఎల్ అధినేత కేపీ శర్మ ఓలీపై ఆర్‌ఎస్‌పీ అధినేత బాలెన్ షా 10 వేల ఓట్లకు పైగా భారీ ఆధిక్యంలో ఉండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

గత ఏడాది సెప్టెంబర్ 2025లో అవినీతికి వ్యతిరేకంగా, సోషల్ మీడియాపై నిషేధాన్ని నిరసిస్తూ యువత (జెన్-జెడ్)  చేపట్టిన భారీ ఆందోళనల కారణంగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ పరిణామాల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు, ముఖ్యంగా యువత మార్పు వైపే మొగ్గు చూపినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ నేత పుష్ప కమల్ దహల్ 'ప్రచండ' తన స్థానంలో విజయం సాధించారు. తుది ఫలితాలు వెలువడేసరికి ఆర్‌ఎస్‌పీ క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 


More Telugu News