వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది: హోంమంత్రి అనిత

  • వెంకటగిరి జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థినుల నిజాయతీ
  • బంగారం, నగదు ఉన్న పర్సును పోలీసులకు అప్పగించిన వైనం
  • చిన్న వయసులోనే గొప్ప నైతిక విలువలు చాటారని మంత్రి ప్రశంస
  • పిల్లలను గొప్పగా పెంచిన తల్లిదండ్రులు, గురువులకు కృతజ్ఞతలు
తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన నిజాయతీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సంతోషం వ్యక్తం చేస్తూ, వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. నేటి కాలంలో నైతిక విలువలు కనుమరుగవుతున్న తరుణంలో, ఈ విద్యార్థినులు ఆదర్శంగా నిలిచారని ఆమె కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

"వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు చూపిన నిజాయతీ నన్ను ఎంతగానో గర్వపడేలా చేసింది. బి.గురుప్రియ, బి.గీతిక, ఎం.గీతిక, పద్మశ్రీ, మరియు హేమలత అనే విద్యార్థులు. తమకు దొరికిన బంగారం, నగదుతో కూడిన పర్సును వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ స్వరూప గారికి అప్పగించి తమ నైతిక విలువలను చాటుకున్నారు. చిన్న వయసులోనే ఇంతటి నీతివంతమైన ప్రవర్తనతో మంచి చేసిన విద్యార్థినులకు హృదయపూర్వక అభినందనలు. బాధితురాలికి ఆ నగలను చేరవేసి ఆదర్శంగా నిలిచిన ఈ చిట్టితల్లులకు అభినందనలు. మీ నిజాయితీ మరెందరికో స్ఫూర్తి కావాలిన ఆకాంక్షిస్తున్నాను. ఇంతటి మంచి విలువలతో పెంచిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పని గురువులకు నా ధన్యవాదాలు" అంటూ అనిత తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, ఈ విద్యార్థినులను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ప్రశంసించారు. "మా అమ్మాయిలు బంగారం" అని కొనియాడారు.

ఏం జరిగిందంటే...

గురువారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్ట‌గా వెంక‌ట‌గిరి ఎస్బీఐ బ్యాంకు వ‌ద్ద మ‌న్న‌వ‌రం బ‌స్సు కోసం నిరీక్షిస్తున్న‌ కొత్త‌ప‌ల్లి గుంటకు చెందిన 8వ త‌ర‌గ‌తి విద్యార్థినులు బి.గురుప్రియ, బి.గీతిక, ఎం.గీతిక, 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ప‌ద్మ‌శ్రీ , 7వ త‌ర‌గ‌తి విద్యార్థిని హేమ‌ల‌తల‌కు ఒక ప‌ర్సు క‌నిపించింది. ప‌ర్సు తీసి చూడ‌గా బంగారం, న‌గ‌దు. దాంతో ఆ అమ్మాయిలు పోలీస్ స్టేష‌న్ కు వెళ్లారు. త‌మ‌కు దొరికిన ప‌ర్సును ఎస్ఐ స్వ‌రూప‌కు అంద‌జేసి, అభినంద‌న‌లు అందుకుని ఇంటికెళ్లేందుకు బ‌స్టాప్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. అక్క‌డ ఓ మ‌హిళ ప‌ర్సు కోసం వెతుకుతూ పిల్ల‌ల్ని అడిగింది. త‌మ‌కే దొరికింద‌ని, స్టేష‌న్‌లో ఇచ్చామ‌ని చెబుతూ ఆమెతో పాటు స్టేష‌న్‌కు వెళ్లారు పిల్ల‌లు. న‌గ‌లు, న‌గ‌దు ఆమెవేన‌ని నిర్ధారించుకున్న ఎస్ఐ ఆ మ‌హిళ‌కు అంద‌జేశారు.



More Telugu News