తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా ఉంది: నారా లోకేశ్

  • గుండెపోటుతో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం మృతి
  • మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
  • విజయవాడలో పార్టీ కార్యక్రమాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న వైనం
తెలుగుదేశం పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ యువజన విభాగమైన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. యువ నాయకుడి అకాల మరణం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగభూషణంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఒక సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా ఉంది. భూషణం అని పిలిస్తే.. ఈ అన్న ముందు వాలిపోయేవాడివి" అంటూ లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో టీఎన్ఎస్ఎఫ్ కార్యక్రమాలను నాగభూషణం తన భుజాలపై వేసుకొని సమర్థంగా నిర్వహించారని, తెలుగు యువతకు ఆయన ఒక బలమని కొనియాడారు.

"ఇంతలోనే అనారోగ్యం నిన్ను కాటేసింది" అంటూ విచారం వ్యక్తం చేశారు. నాగభూషణం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. నాగభూషణం మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News