లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

  • హైదరాబాద్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఏఈ
  • రూ.16 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
  • సీజ్ చేసిన మీటర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్
హైదరాబాద్‌లో ఓ విద్యుత్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మాసబ్ ట్యాంక్ సెక్షన్‌లోని టీజీఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్స్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఓ వినియోగదారుడి నుంచి రూ.16,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఓ ఫిర్యాదుదారునికి చెందిన విద్యుత్ మీటర్‌ను అధికారులు సీజ్ చేశారు. దానిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఏఈ శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా పథకం ప్రకారం వల పన్నారు. బాధితుడి నుంచి శ్రీనివాసరావు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్, వెబ్‌సైట్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.


More Telugu News